మన్సూరాబాద్, మార్చి 27: పార్కింగ్ చేసిన 18 పల్సర్ బైకులను అపహరించిన కేసులో ఓ పాత నేరస్తుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 18 లక్షల విలువైన 18 పల్సర్ బైకులు, 3 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఏ. కృష్ణయ్య వివరాలను వెల్లడించారు. మూసారాంబాగ్ నివాసి భరత్కుమార్ (28) కారు డ్రైవర్. అతడు జల్సాలకు అలవాటు పడి, డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. గతంలో పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత అతడు తన మకాంను మూసారాంబాగ్కు మార్చాడు. నగరంలోని పలు కాలనీల్లో తిరుగుతూ పార్కింగ్ చేసిన ఖరీదైన పల్సర్ బైకులను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే 18 పల్సర్ బైకులను దొంగలించాడు.
ఇందులో ఐదు బైకులను సంగారెడ్డి జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ కిట్టు (22)కు విక్రయించాడు. ఎల్బీనగర్ అపహరణకు గురైన పల్సర్ బైకు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల్లో లభించిన ఫుటేజీతో పాటు ఇతర మార్గాల ద్వారా సేకరించిన ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. ఎల్బీనగర్లోని డీవీఎం కళాశాల సమీపంలో నిందితుడు భరత్కుమార్ తిరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దొంగతనాలు బయటపడ్డాయి. బైకులు అపహరించిన కేసుల్లో భరత్కుమార్ను.. అతడి నుంచి బైకులు కొనుగోలు చేసిన చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 18 బైకులను స్వాధీనం చేసుకోవడంతో పాటు చిన్నయ్యకు చెందిన హెడ్డీఎఫ్సీ బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 22, 205 వేల నగదును కూడా సీజ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, డీఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు.