హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంట్లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్ల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి కారణంగా నిర్వాహించుకోలేక పోయారని అన్నారు. ఈ సంవత్సరం రంజాన్ ఒక్క పొద్దులు ( రోజా) ఏప్రిల్ 2 లేదా 3 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నెల రోజుల పాటు జరిగే ఒక్క పొద్దుల సందర్బంగా ముస్లీం సోదరులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మసీదు కమిటీ సభ్యుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, చెత్త, తదితర వ్యర్థాలను ప్రతిరోజు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మసీదుల లో నెల రోజుల పాటు ఇప్తార్ విందుల నిర్వహణ ఉంటున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
అదేవిధంగా మసీదులకు వెళ్లే అన్ని రహదారులకు అవసరమైన ప్రాంతాలలో మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మసీదులకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరా కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పలు మసీదు కమిటీల సభ్యులు వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేర్లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎంసీలు వంశీ, ముకుంద రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, సీజీఎం ప్రభు, హార్టికల్చర్ డీడీ లు శ్రీనివాస్, శ్రీదేవి, ఎలక్ట్రికల్ డీఈ లు మహేష్ కుమార్, సుధీర్ కుమార్, AMOH ప్రవీణ్, మసీదు కమిటీ సభ్యులు సిరాజ్, ఫహీం, దావూద్ రషీద్, యాసిన్, నజీర్, జావేద్, అఖిల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.