మేడ్చల్, మార్చి 30: వచ్చే నెల 3వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో గుర్తించిన కేంద్రాలను మండల విద్యాధికారులు పరిశీలించారు. ఏర్పాట్లపై కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర మండలాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు.మేడ్చల్ మండలంలోని 10 కేంద్రాల్లో 2100 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే శామీర్పేటలోని 7 కేంద్రాల్లో 1520 మంది, కీసరలోని 7 కేంద్రాల్లో 1260 మంది, ఘట్కేసర్లో 8 కేంద్రాల్లో 1440 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేశారు. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి 200 నుంచి 220 మంది మాత్రమే కేటాయించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
పరీక్షలో కాపీయింగ్ నివారణకు ఈ సారి పకడ్బందీగా చర్యలు తీసుకోకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరా నీడలోనే నిర్దేశిత సమయంలో పరీక్షా పత్రాలను తెరిచి, పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులతో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్(డీవో), చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్)కు సైతం మొబైల్ ఫోన్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించరాదని నిబంధన విధించారు. నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు పరీక్షా కేంద్రాల నిర్వహణ అవగాహన సమావేశాన్ని హెచ్చరించారు. విద్యార్థులు 5 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే కేంద్రంలోనికి ప్రవేశ నిరాకరణ నిబంధన విధించారు.
ఏర్పాట్లు పూర్తి…
మేడ్చల్, శామీర్పేట మండలాల్లో పదో తరగతి నిర్వహణకు 17 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా ఉండేలా చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయం కన్నా ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతి ఉండదు. అందువల్ల విద్యార్థులు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఎండా కాలం కావడం వల్ల విద్యార్థులు అల్పాహారాన్ని తీసుకుని రావాలి. అన్ని కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా రాసేందుకు ఏర్పాట్లు చేశాం.
-వసంతకుమారి, ఎంఈవో, మేడ్చల్, శామీర్పేట