సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): నిషేధిత పతంగుల దారాలు మనిషుల ప్రాణాలు తీస్తున్నాయి. చైనీస్ మాంజాల విక్రయాలపై నిషేధమున్నా విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. చైనీస్ మాంజా పర్యావరణానికి, పక్షులు, మనిషులకు ప్రమాదమని దీనిని నిషేధించారు. గ్లాస్తో తయారు చేసిన నిషేధిత మంజాలను అక్రమ పద్ధతిలో నగరానికి తెచ్చి పలువురు విక్రయిస్తున్నారు.
తాజాగా నగరంలో బైక్పై వెళ్తున్న ఆర్మీ జవాన్ను గొంతుకు తట్టుకొని అతని ప్రాణాలను తీసేసింది. గతంలో నెల రోజుల ముందు నుంచే పతంగుల దుకాణాలలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ఒకటి రెండు సార్లు మినహా తనఖీలు నిర్వహించలేదు. దీంతో విచ్చలవిడిగా నిషేధిత మంజాల విక్రయాలు కొనసాగాయి. ఎక్కడ చూసిన క్షేత్ర స్థాయిలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండడంతో, అది మనిషుల ప్రాణాలపైకి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.