నాంపల్లి కోర్టులు, మే 20 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు చెందిన ముగ్గురు బినామీలు గోదవర్తి సత్యనారాయణమూర్తి అలియాస్ జీఎస్ఎన్ మూర్తి, పెంట భరత్కుమార్, పెంట భరణీకుమార్ల తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. గత నెల 23న ఏసీబీ కోర్టు వారికి రిమాండ్ విధించింది. 27 రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బెయిల్ మంజూరు చేయరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురిపై అధికంగా ఆస్తులను కొనుగోలు చేసినట్టు ఆధారాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
బెయిల్పై విడుదలైతే సాక్షులను, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నదన్నారు. ఆ ముగ్గురు నిందితులు రిమాండ్ ఖైదీలుగా చంచల్గూడ కారాగారంలో కొనసాగుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బినామీ పేర్లపై ఆస్తులను రిజిస్టర్ చేశారంటూ కౌంటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా ముగ్గురు బినామీలుగా నమోదైన నిందితులపై ఎన్నో భూములను కొనుగోలు చేసినట్టు అధికారులు ఆధారాలను సేకరించారు. అక్రమాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను రిమాండ్ కేసు డైరీలో వివరించినట్టు పీపీ కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల తరఫున వాదనలు విన్న కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.