ఖైరతాబాద్, ఫిబ్రవరి 12 : గ్రేటర్ హైదరాబాద్లో సామాన్యులు నడిచేందుకు సరైన ఫుత్పాత్లే లేవని రోడ్క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మాల్కం ఊల్ఫ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, ట్రాఫిక్ నిబంధనలు, పాలకుల విధానాలపై మాట్లాడారు. నగరంలో నామమాత్రంగా ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించడంతో కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై నడిచి అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయారు. ఇటీవల ఓ మహిళ రోడ్డు, ఫుట్పాత్ను ఆక్రమించి హోటల్ నడిపిస్తుంటే పోలీసులు చర్యలు తీసుకోగానే చాలా మంది ట్విట్టర్, సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలిచారని, అయితే ఆ హోటల్ వల్ల ఎందరో రోడ్లపై నడిచి ప్రమాదాలకు గురవుతూ జీవితాలను కోల్పోతున్నారన్న విషయాన్ని గ్రహించడం లేదన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ కేశవ్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని, పలు అధ్యయనాల్లో 80 శాతం డ్రైవర్ తప్పిదమేనని తేలిందన్నారు.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అసలు ట్రాఫిక్ నిబంధనలే పాటించడం లేదని, ఎవరూ హెల్మెట్లు పెట్టుకోరని, నంబర్ ప్లేట్ ఉండదని, రాంగ్ రూట్లలో యథేచ్ఛగా ప్రయాణిస్తున్నారని, ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోవడంలేదని తెలిపారు. బ్రిగేడియర్ శ్రీరామ్ మాట్లాడుతూ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు, యూటర్న్ వల్ల సమస్య పరిష్కారం కావడం లేదని, పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఎందుకు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితం రూపొందించిన ట్రాఫిక్ చట్టాలనే ఇంకా అమలు చేస్తున్నారని, వీటిపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన లేనట్లు కనిపిస్తుందన్నారు. మన దేశంలో రాజకీయాలకు సంబంధించిన కేసులు త్వరగా కోర్టులో చర్చకు వస్తాయి.. కానీ ట్రాఫిక్కు సంబంధించిన కేసులు మాత్రం సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉంటాయని తెలిపారు. ఇప్పటికైనా చట్టాల్లో సవరణలు చేయాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ క్రాఫ్ట్ సంస్థ కార్యదర్శి ఆదిశంకర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.