(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలనకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్దకు ప్రజలు భారీగా పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు రద్దీగా మారాయి. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నది.
ఆరు రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డు, ఇతర సమస్యలపై ప్రజలు సమర్పించిన దరఖాస్తులు మొత్తం 19,03,462లను అధికారులు స్వీకరించారు. ఇందులో అభయహస్తం కింద 15,30,006 దరఖాస్తులు ఉండగా, ఇతర ఆప్లికేషన్లు 3,73,456 ఉన్నాయి. కాగా ఒక్క గురువారమే 2,55,114 దరఖాస్తులను స్వీకరించినట్లు కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. కాగా దరఖాస్తుల స్వీకరణలో అత్యధికంగా రేషన్కార్డు, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, రూ.500 సిలిండర్లకు సంబంధించి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.