హైదరాబాద్ : పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్టులకు ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచాలని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్పిడిసియల్ తో సరి సమానంగా ఎస్పిడిసియల్ ధరలు సవరించాలని ఆ సంఘం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మేరకు ఆదివారం సాయంత్రం అసోసియేషన్ కార్యవర్గం మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో&జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావులతో కలిసి తమ డిమాండ్లను వివరించారు. డిస్కంలకు మొత్తం ఒకే ధర ఉండేలా చూడాలని ఎస్పిడిసియల్- ఎస్పిడిసియల్ మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్నీ వారు మంత్రి జగదీష్ రెడ్డికి వివరించారు.
అంతే గాకుండా విద్యుత్ కాంట్రాక్టు లకు అధికారులు రూపొందించే అంచనా వ్యయాలలో పీఎఫ్,ఈ ఎస్ఐలతో పాటు సెస్, కాంట్రాక్టర్లకు అలవెన్సెస్ లను కలపాలని వారు కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ రంగంలో దేశ స్థాయిలో మంచి గుర్తింపు దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పై మాకు సంపూర్ణ విశ్వసనీయత ఉందని, మా డిమాండ్లపై సానుకూలంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తద్వారా తెలంగాణలో విద్యుత్ సంస్థలను నమ్ముకుని పనిచేస్తున్న లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ తరపున అధ్యక్షుడు శివకుమార్ ప్రధాన కార్యదర్శి యస్ కే మాజిద్ జాయింట్ సెక్రెటరీ సదానందం ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాలు రాష్ట్రంలోనీ అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.