ఏపీలో గంజాయి దందా.. హత్య కేసు
వెంగళరావునగర్, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.
విజయవాడలో గంజాయి విక్రయాలు, హత్యకు పాల్పడి నగర బహిష్కరణకు గురైన ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా రహస్యంగా నగరానికి వచ్చింది. వారిని వెంబడిస్తూ వచ్చిన ఏపీ పోలీసులు అమీర్పేటలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఎస్ఆర్నగర్ పోలీసుల సహాయంతో సదరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.