సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం పక్షపాత వైఖరితో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంత వాసులలో వ్యాపారులు, భూ యజమానులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. మార్కెట్ ధరలు ఒకలా ఉంటే.. రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో మాత్రం తక్కువ ధరలు చూపించి, భూసేకరణ వ్యవహారాన్ని తేల్చకుండానే, రెండోసారి పరిహారం నోటీసులను జారీ చేశారు. ఎలివేటెడ్ కారిడార్ వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉంటే విలువైన ఆస్తులను కోల్పోతున్నామనే ఆందోళన చెందుతుంటే.. కనీసం పరిహారం విషయంలోనూ తమకు న్యాయం చేయకుండా సర్కారు వ్యవహరిస్తుందంటున్నారు.
ఇప్పటికే మార్కెట్ ధరలకు అనుగుణంగా రెండింతలు పరిహారం కోరుతున్న సర్కారు పట్టించుకోవడం లేదు. అల్వాల్ నుంచి లోతుకుంట వరకు విస్తరించి ఉన్న భూ యజమానుల నుంచి సేకరణ, పరిహారం అంశాలను తేల్చేందుకు ప్రత్యేకంగా నోటీసులు జారీ చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుగా అనుగుణంగానే, భూ పరిహార విషయంలో నష్టం వాటిల్లకుండా, ఐక్యంగా పోరాడాలని జేఎసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ఆల్వాల్లోని ఓ హోటల్లో నిర్వహించనున్న సన్నాహాక సమావేశంలో పరిహారం, ప్రభుత్వ తాజా చర్యలపై చర్చిస్తామని జేఎసీ ప్రతినిధులు పేర్కొన్నారు.