బాచుపల్లి ఎస్ఎల్జీ ఆధ్వర్యంలో కొనసాగిన 5కే రన్, సైక్లింగ్..
పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్, ఆస్పత్రి సీఎండీ దండు శివ రామరాజు
దుండిగల్, మే 29: పొగ తాగడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ నెల 31న పొగాకు వ్యతిరేక దినంను పురస్కరించుకుని ఆదివారం బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆస్పత్రితో కలిసి ‘హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్’ల సంయుక్త ఆధ్వర్యంలో 5కే రన్, సైక్లింగ్లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ సీఎండీ శివ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగాకు క్యాన్సర్కు కారకమని, సిగరెట్లు, బీడీలను సేవించడం వల్ల వాటిలో ఉండే నికోటిన్ అనే విష పదార్థంతో ప్రజల ఆరోగ్యాలపై పెను ప్రమాదం చూపుతోందన్నారు.
పొగాకు తాగే వారే కాకుండా చుట్టు పక్కల ఉండే జనం సైతం క్యాన్సర్ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్ను చేజేతుల నాశనం చేసుకుంటున్నదని, ఇటు వంటి వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన హితవు పలికారు. పొగాకు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ చేపట్టిన ఎస్ఎల్జీ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. మున్ముందు సైతం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని అభిలషించారు. అనంతరం, ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ నేడు ధూమపానం ఫ్యాషన్గా మారిపోయిందని, ఇందులో మహిళలు, పిల్లలు సైతం ఉంటున్నారన్నారు. చికిత్స కంటే నివారణే మంచిదని ఎల్ఎస్జీ ఆస్పత్రి భావిస్తున్నదని, వివిధ వ్యాధులు, నివారణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడంలో తాము ముందంజలో ఉన్నామన్నారు. ఈ 5కే రన్, సైక్లింగ్లో 600 మందికి పైగా రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు ఆగం పాండు ముదిరాజ్, ఆగం రాజు పాల్గొన్నారు.