సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్ (పీఆర్ అండ్ మార్కెటింగ్) అనుపం అథవాలే శుక్రవారం తెలిపారు. అవినీతి రహిత భారత్ను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ కేఎస్ఎన్వీ సుబ్బారావు, అధికారులు కృష్ణ చాటె, జేబీ వశిష్ట్, యు.శణ్ముకరావు, ఎస్ఎన్ తాల్రెజ, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యూకో బ్యాంక్ ఆధ్వర్యంలో..
విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్లోని యూకో బ్యాంకు జోనల్ కార్యాలయం నుంచి జీవీకే మాల్ వరకు శుక్రవారం వాకథాన్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ మనీశ్కుమార్, డీజీఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
పవర్గ్రిడ్ ప్రాంతీయ కార్యాలయంలో..
బన్సీలాల్పేట, నవంబర్ 4 : విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లో పవర్గ్రిడ్ సంస్థ దక్షిణ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ‘అవినీతి నిర్మూలన’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐఎస్ఎఫ్, డీఐజీ డి.శ్యామల హాజరై మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని పేదలందరికి అందాలని పేర్కొన్నారు. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని సూచించారు. ఈ సదస్సులో పవర్గ్రిడ్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ శర్మ, ఎన్వీ.రాజు, పీకే.హరినారాయణ, పలు విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మిధానిలో..
మాదన్నపేట, నవంబర్ 4 : రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచనల మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2022 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన వారోత్సవాలను మిధాని చైర్మన్ ఎస్.కే , మేనేజింగ్ డైరెక్టర్ ఝూ మిధాని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వారం రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ,జాగృతి పత్రిక రచయితలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఫైనాన్స్ గౌరీశంకర్ రావు, ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ముత్తుకుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ఉపేంద్ర ,మిధాని సీనియర్ అధికారులు పాల్గొన్నారు.