అల్వాల్, జూన్ 17: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణం బలైన ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్వాల్ డివిజన్ ఎంఈఎస్ కాలనీలో బుధవారం అపార్ట్మెంట్ ముందు చెట్టు కొమ్మలు కొడుతున్న దినసరి కూలి దాసరి సూర్యనారాయణ (45) విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న అల్వాల్ సీఐ ప్రశాంత్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రోజు కూలి చేసుకుని భార్య, ముగ్గురు కుమారులను పోషిస్తున్న సూర్యనారాయణ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు.