IT corridor | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతోంది. కరోనాతో రెండేళ్లపాటు ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులంతా ఇప్పుడు ఐటీ ఆఫీసులకు వస్తున్నారు. దీంతో ఐటీ ఉద్యోగులతో పాటు పనుల కోసం వచ్చే వారితో ఎక్కడ చూసినా రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ రంగం శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానికి అనుగుణంగా రోడ్లను వెడల్పు చేసినా, అవి క్రమంగా సరిపోని పరిస్థితి నెలకొంది. టీ హబ్ ఎదురుగా ఉన్న 5 రోడ్ల కూడలి నుంచి సాఫీగా రాకపోకలు సాగించాలంటే చాలా దూరంగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ కూడలిలో 5 వైపులా వెళ్లేందుకు రోడ్డు మార్గాలున్నా, రద్దీ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని టీ హబ్ జంక్షన్ నుంచి మొదలు సుమారు 600 మీటర్ల దూరం ఉండే అండర్పాస్ను నిర్మించాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
మాదాపూర్ నుంచి నేరుగా టీ హబ్ కూడలికి…
మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి మైండ్ స్పేస్ రహేజా జంక్షన్ మీదుగా రాయదుర్గం వెళ్లేందుకు ఉన్న ప్రధాన రహదారికి సమాంతరంగా కొత్తగా మరో లింకు రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ లింకు రోడ్డు మాదాపూర్ ప్రధాన రహదారిలోని రత్నదీప్ సూపర్మార్కెట్ కూడలి నుంచి ప్రారంభమై హుడా టెక్నో ఎన్క్లేవ్ రోడ్డు మీదుగా రహేజా మైండ్ స్పేస్ సెజ్లోంచి టీ హబ్ కూడలి కలిసే రోడ్డుకు కలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మార్గం పూర్తయితే టీహబ్ 5 రోడ్ల కూడలిలోనూ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుంది. మరోవైపు దీనికి సమాంతరంగా ఉన్న మాదాపూర్- బయోడైవర్సిటీ మార్గంలోనూ ఐకియా వద్ద మెట్రో స్టేషన్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. ఇలా రెండు సమాంతర మార్గాల మధ్య సుమారు 600 మీటర్ల దూరం ఉంది.
ఈ రెండు కూడళ్లను కలుపుతూ ఒక అండర్పాస్ను నిర్మిస్తే నేరుగా శిల్పా లేఅవుట్ వద్ద ప్రారంభమయ్యే ఔటర్ రింగు రోడ్డు వెళ్లే మార్గానికి చేరుకోవచ్చు. దీనివల్ల జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు టీహబ్ ముందు నుంచి నిర్మించే అండర్పాస్లోంచి నేరుగా ఓఆర్ఆర్ వెళ్లే మార్గంతో పాటు గచ్చిబౌలి రాంకీ టవర్స్, మీనాక్షి టవర్స్ వంటి ఐటీ కార్యాలయాలకు సులభంగా చేరుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే ఎయిర్పోర్టు మెట్రో ప్రయాణికులకు ఇది ఉపయోకరంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అండర్పాస్ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై హైదరాబాద్ మెట్రో రైలు, టీఎస్ఐఐసీ అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. ఈ అండర్పాస్ నిర్మాణం కార్యరూపం దాల్చితే ఐటీ కారిడార్లో మరింత మెరుగైన రాకపోకలకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని ఐటీ ఉద్యోగులు, ట్రాఫిక్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.