Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, వినయ్ భరద్వాజ ల్యాప్టాప్లో 66.9 కోట్ల మంది వివరాలు ఉన్నట్లుగా గుర్తించారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల డేటాను ‘ఇన్ స్పైర్ వెబ్స్’ అనే వెబ్సైట్ ద్వారా విక్రయించినట్లు గుర్తించారు.
జీఎస్టీ, పాన్ కార్డ్, యూట్యూబ్, ఫోన్ పే, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, అప్ స్టాక్స్, బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, వేదాంత, బుక్ మై షో, బైజూస్ నుంచి డేటాను చోరీ చేశాడు. బైజూస్ ద్వారా 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను సైతం సేకరించి తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దేశంలో 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రోపాలిటన్ నగరాలకు చెందిన వారి వ్యక్తిగత డేటాను దొంగించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ముఠా ఏపీకి చెందిన 2.1 కోట్ల మంది నుంచి డేటా చోరీ చేసినట్టు వెల్లడైంది. హైదరాబాద్ చెందిన 56 లక్షల మంది డేటా కూడా ఈ ముఠా వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు చెందిన 21.39 కోట్ల మంది డేటా చోరీకి గురైనట్లు పోలీసులు వర్గాలు వివరించాయి.