సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): బస్తీ వైద్యం మరింత విస్తరించనుంది. ఫలితంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు మరింత చేరువ కానుంది. గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 73 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పీహెచ్సీలతో పాటు బస్తీ దవాఖానల్లోనూ టెలీమెడిసిన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ అందిస్తుండడంతో గ్రేటర్ ప్రజలు బస్తీదవాఖానలకు వెళ్లేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
కొత్తగా మరో 73 బస్తీ దవాఖానలు..
గ్రేటర్ వ్యాప్తంగా మరో 73 బస్తీ దవాఖానలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 292బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న బస్తీలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ రెండవ దఫాగా గ్రేటర్కు 73కొత్త బస్తీదవాఖానలను మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్త దవాఖానల నిర్మాణం, వైద్యసిబ్బంది నియామక ప్రక్రియ తదితర కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
హైదరాబాద్ పరిధిలో..
హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 152బస్తీ దవాఖానలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 21దవాఖానలు మంజూరు కాగా వాటిలో 12దవాఖానలు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో నేడు తిలక్నగర్ బస్తీ దవాఖానను ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. మిగిలిన దవాఖానలను దశల వారీగా మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రస్తుతం 59 దవాఖానలు అందుబాటులో ఉండగా రెండో దఫాలో కొత్తగా మరో 14దవాఖానలు మంజూరైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. త్వరలోనే ఈ బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ప్రస్తుతం 81బస్తీ దవాఖానలు అందుబాటులో ఉండగా కొత్తగా మరో 38బస్తీ దవాఖానలు మంజూరైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. రెండు, మూడు నెలల్లోనే కొత్త బస్తీదవాఖానలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.