సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. అంతేకాదు వివిధ రకాలు గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చైనా మాంజాతోనే పెను ప్రమాదం..
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడొద్దని, సాధారణ దారాన్నే వాడాలని జంతు, పక్షి పర్యావరణ ప్రేమికులు అందరికీ సూచిస్తున్నారు. అయితే చైనీస్, నైలాన్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం కొనసాగుతున్నది. ఎందుకంటే పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ తిప్పలు తప్పవని చెబుతున్నారు.
మాంజాలు వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. గురువారం ఉదయం ఫతేనగర్లో ఓ చెట్టుపై మాంజాలో చిక్కిన పావురం విలవిలలాడింది. సనత్నగర్ అగ్నిమాపక అధికారి ప్రదీప్ రక్షించి.. నీళ్లు తాగించి.. బియ్యపు గింజలు వేశారు. అరగంట తర్వాత శక్తిని పుంజుకున్న ఆ పావురం.. రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మూగజీవాలను కాపాడుకుందాం..
పతంగుల పండుగను సంతోషంగా జరుపుకుందాం. పక్షులే కాదు మనుషులకు, జంతువులకు ప్రాణాంతకంగా పరిణమించిన పతంగుల గాజుముక్కల మాంజాను వినియోగించవద్దు. ఇటు పక్షులకూ, అటూ మూగజీవాలనూ రక్షించుకోవాల్సి బాధ్యత ప్రతిఒక్కరిది.
– డాక్టర్ గాజుల ప్రభాకర్, యువ శాస్త్రవేత్త
మాంజా వల్ల మూగజీవాలకు ప్రమాదం
చైనా మాంజా వల్ల అనేక పక్షులకు, మూగ జీవాలకు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. పతంగులను సాధారణ దారాలతోనే ఎగురవేస్తే… వాటికి జరిగే ప్రమాదాలను నివారించవచ్చు. అందుకు నగరవాసులందరూ మూగ జీవాలకు ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలి.
– మహ్మద్ ఖలీల్, పెంపుడు జంతువుల ప్రేమికుడు