సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ముచ్చటగా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తొమ్మిదేండ్లుగా జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందుకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు చెబుకుంటున్నారు. అయితే, జిల్లాలో దాదాపు 45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో అధిక సంఖ్యలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారే ఉన్నారు. నగరంలోని 15 నియోజక వర్గాలకు చెందిన ఓటర్లు బీఆర్ఎస్ను గెలిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
ఫ్లై ఓవర్లు నిర్మాణాలు, స్కైవాక్ నిర్మాణాలు, అండర్ పాసులు వంటి నిర్మాణాలు పూర్తి చేసి నగరంలో పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు. పైగా, ప్రధాన కూడళ్లలో గతంలో అనేక సిగ్నళ్లతో వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండేవి. కాని, సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో సిగ్నళ్ల వద్ద వెయిటింగ్ లేకుండా వాహనాలు సాఫీగా సాగిపోవడానికి దోహదపడింది. నగర వాసులకు ఆక్సిజన్ కోసం మొక్కలు నాటి, గాలిలో ఆక్సిజన్ స్థాయి పెంచారు. నగరంలో చెత్త సేకరణ కోసం సబ్సిడీతో వాహనాలు పంపిణీ చేశారు. తడి పొడి చెత్త సేకరణ కోసం వేర్వేరుగా బుట్టలు పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణకు వేర్వేరుగా బుట్టలు ఉండటం గమనార్హం.
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు కొదవ లేదు. సంక్షేమ పథకాల వల్ల ఎందరో ప్రజలు లబ్ధిదారులుగా మారారు. ఈ క్రమంలో జిల్లాలో సంక్షేమ పథకాల విషయానికొస్తే., 1.32 లక్షల మంది షాదీ ముబారక్ / కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఉన్నారు. అందుకోసం రూ.1134 కోట్లు ప్రభుత్వం నిధులు కేటాయించిది. అలాగే, 2.74 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చారు. అందుకోసం తొమ్మిదేండ్లలో కూడా రూ.3,150 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. అలాగే, జిల్లాలో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేశారు.
మనబస్తీ – మనబడి కార్యక్రమం కింద జిల్లాలో రూ.45 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. ప్రైవేటుకు దీటుగా ఆ స్కూళ్లను తీర్చిదిద్దారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు జోరుగా వలసలు వచ్చారు. కొనసాగింపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకులాలు ఏర్పాటు చేశారు. దళిత బంధు, బీసీలకు ఆర్థిక సాయం వంటి సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయన్న అభిప్రాయాలు స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ఇక్కడ ప్రజలు నమ్మడం లేదు. దీంతో తిరిగి మూడోసారి ముచ్చటగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న అభిప్రాయాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి.