సికింద్రాబాద్, జనవరి 4: కొత్త ఏడాదిలో తొలిబోర్డు సమావేశానికి రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరగనుంది. సీఈఓ మధుకర్ నాయక్, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న ఈ సమావేశంలో పాల్గొంటారు.
కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై ఇటీవల స్థానికంగా ఆందోళనలు తీవ్రతరం అయిన నేపథ్యంలో ఈ అంశంపై బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు గత నవంబర్ నుంచే టోల్ ట్యాక్స్ వసూళ్లు నిలిపివేస్తామంటూ తీర్మానించిన బోర్డు, గెజిట్ విడుదల కాలేదన్న సాకుతో యథావిధిగా వసూళ్లు కొనసాగిస్తోంది. దీనిపై కూడా బోర్డులో చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండాలో చేర్చిన పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ఇదిలా ఉండగా కంటోన్మెంట్కు స్థానిక మిలటరీ అధికారులు చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిలు రూ.750 కోట్లు దాటాయన్నారు.
బోర్డు తీర్మానం తప్పనిసరి
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ఏవేని రోడ్లను మూసివేయాలంటే బోర్డు తీర్మానం తప్పనిసరి. అయితే ఇటీవల కొన్ని రోడ్లను శాశ్వతంగా మూసేస్తున్నట్లు బోర్డు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రోడ్ల మూసివేత, అభ్యంతరాలపై గురువారం నాటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టోల్ చర్చ
ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా కేంద్రం కంటోన్మెంట్లోనూ టోల్ట్యాక్స్ ఎత్తివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన ఆదాయ మార్గాల్లో ఒకటైన టోల్ట్యాక్స్ ఎత్తివేస్తే, ప్రత్యామ్నామంగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గెజిట్ వెలువడేంత వరకు వసూళ్లు చేసుకునేలా కాంట్రాక్టర్కు వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకోసం ప్రతీ నెలా 10 శాతం అధిక మొత్తంలో చెల్లించాలని సూచించడం గమనార్హం. దీనిపై కాంట్రాక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో టోల్ట్యాక్స్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై జరిమానా విధించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ రెండు అంశాలపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.