కార్వాన్, ఫిబ్రవరి 27: లోన్యాప్ వేధింపులు తాళలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఇటీవల క్రెడిట్ కార్డు, బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులతో కీసరలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే లోన్యాప్ వేధింపులతో మరో విద్యార్థి మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సీరం మనోజ్ (20) దుండిగల్లోని ఓ కళాశాలలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ.. అందుకు కావాల్సిన డబ్బులు లోన్యాప్ల ద్వారా తీసుకున్నాడు. మొదట తీసుకున్న అప్పులకు సంబంధించి రూ.3 లక్షలు అతడి తండ్రి తీర్చేశాడు. లోన్యాప్ సంస్థల నుంచి ఇంకా బాకీ డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి.
ఆ డబ్బును చెల్లించేందుకు మరో యాప్ నుంచి రుణం పొందాడు. ఈ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో రుణ యాప్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. సెల్ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా.. బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వేధించడం మొదటు పెట్టారు. ఒకపక్క విషయం తండ్రికి చెబితే ఏమనుకుంటాడోనని మనస్తాపం.. అప్పుల వాళ్లు అందరికి ఫోన్లు చేస్తుండటంతో తట్టుకోలేని ఆవేదనతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు.. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువత తప్పుటడుగులు వేసి తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిల్చొద్దంటూ మనోజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.