కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 8 : ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… జీడిమెట్ల ఎన్సీఎల్ సింధూ అపార్ట్మెంట్ ప్లాట్ 510లో నివాసం ఉంటున్న డోలి నిఖిల్కుమార్ కూతురు ఆద్య(8) కిడ్స్ వరల్డ్ స్కూల్లో రెండవ తరగతి చదువుతుంది.
ఆద్యకు చిన్ననాటి నుంచి మాటలు రావు. ఆదివారం సాయంత్రం చిన్నారిని తన తండ్రి నిఖిల్కుమార్ తమ గేటెడ్ కమ్యూనిటీ ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్వద్దకు తీసుకెళ్లాడు. గత ఏడాది మాదిరిగా ఆద్యకు ఈత నేర్పించేందుకు పరికరాలతో తీసుకెళ్లగా.. తన తండ్రి సహాయంతో నేర్చుకుంటుంది. స్విమ్మింగ్ అనంతరం నిఖిల్ తన బట్టలు మార్చుకునేందుకు అక్కడే ఉన్న డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లగా స్విమ్మింగ్పూల్ పక్కనే ఉన్న ఆద్య ఎలాంటి రక్షణ లేకుండా స్విమ్మింగ్పూల్లో దూకింది.
బట్టలు మార్చుకొని బయటకు వచ్చిన తండ్రికి కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. కాసేపటికి స్విమ్మింగ్పూల్లో ఆద్య విగతజీవిలా దర్శనమిచ్చింది. స్థానికుల సహకారంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.