అంబర్పేట, అక్టోబర్ 13: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి చాలా మంది బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. బాగ్అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన శోభారాణి ఆధ్వర్యంలో ౩౦౦ మంది మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబర్పేట ప్రజలను ఏనాడూ పట్టించుకోని మంత్రి కిషన్ రెడ్డి ముసిముసి నవ్వులతో మళ్లీ వస్తాడని, నవ్వులు చూసి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎంపీ ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం నుంచి ఆయనకు ౪౦వేల మెజార్టీ వచ్చిందని, ఇక్కడి ప్రజలు ఆయనకు మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి పొందిన తర్వాత అంబర్పేట ప్రజలను, పార్టీ కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు.