కవాడిగూడ, ఏప్రిల్ 14: దేశానికి ల్యాండ్ మార్కుగా అంబేద్కర్ విగ్రహం, రాష్ట్ర నూతన సచివాలయం నిలుస్తుందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టక్ కె.నారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడి పాపయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ ఆర్టికల్ 3ని పొందుపర్చడంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దళితుల మోములో చిరునవ్వులు నింపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, పలు పార్టీల నాయకులు హాజరై నివాళులర్పించారు.