ముషీరాబాద్, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని నెమరువేసుకున్నారు. రాంనగర్ డివిజన్ అంబేద్కర్నగర్లో జరిగిన కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు పొందిన దేశ ప్రజలకు ప్రశ్నించే హక్కు, ఓటు హక్కు ప్రధానమైనవని, ప్రాథమిక హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం అనే ఆయుధం ప్రతిఘటిస్తుందన్నారు. దేశంలోని అన్ని వర్గాల హితం, అట్టడుగు వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని దూరదృష్టితో రచించారని కొనియాడారు. అంబేద్కర్ కృషి వల్లనే నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు హక్కులు, సంక్షేమ పథకాలను పొందుతున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా యువత పాటుపడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావులపాటి మోజస్, నాయకులు ఎర్రం శేఖర్, మన్నే దామోదర్రెడ్డి, జనార్థన్, సత్యనారాయణ, టీవీ రాజు, సందీప్, శ్రీకాం త్, మున్నా, సునీల్, నీలాదేవి, సంపూర్ణ, తులసీ తదితరులు పాల్గొన్నారు. అలాగే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డిమల్ల పార్వతి సత్యానగర్లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చిక్కడపల్లి, నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయం చైర్పర్సన్న ప్రసన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం కార్యదర్శి పద్మజ, సుకేశ్, అవినాశ్, వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, నవంబర్ 26: విద్యార్థులు ప్రజాస్వా మ్యం, రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కవాడిగూడ డివిజన్లోని దోమలగూడ ఏవీ కళాశాల ఆడిటోరియంలో స్టూడెంట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘యూత్ పార్లమెంట్ స్కీమ్’ కింద తరుణ్ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, ఎం.విద్యులత, ఎ.మంజులా దేవి, బుచ్చిరెడ్డి, కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయాలని ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ సుధాకర్, ఇందిరాశోభన్, శోభన్బాబు భూక్యా, డాక్టర్ ఆన్సారీ, రాములు గౌడ్లు అన్నారు. ఈ మేరకు శనివారం భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్బండ్లోని భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా భోలక్పూర్లోని ఇందిరానగర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.