అంబర్పేట : హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాల లక్కీ డ్రా శనివారం అంబర్పేట ఛే నంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ ప్యాలెస్లో పారదర్శకంగా జరిగింది. జిల్లాకు సంబంధించి 179 మద్యం దుకాణాలకు 3546 దరఖాస్తులు వచ్చాయి. అయితే 179 షాపుల్లో 178 షాపులకు మాత్రమే డ్రా నిర్వహించారు.
చార్మినార్ ఏరియాలో ఒక షాపుకు తక్కువ దరఖాస్తులు వచ్చాయనే కారణంతో డ్రాను నిలిపివేశారు. హైదరాబాద్ జిల్లా యావరేజ్ దరఖాస్తులు 22. కానీ చార్మినార్ ఏరియా షాపుకు కేవలం పది దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సరాసరి కన్నా తక్కువ రావడంతో ఆ ఒక్క షాపుకు సంబంధించిన డ్రాను నిలిపివేశారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాను రెండు యూనిట్లు అంటే సికింద్రాబాద్ యూనిట్, హైదరాబాద్ యూనిట్గా విభజించి లాటరీ విధానంలో దుకాణాలను కేటాయించారు. సికింద్రాబాద్ యూనిట్ డ్రా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీ ఎం.రఘునందన్రావు పర్యవేక్షణలో జరిగింది. హైదరాబాద్ యూనిట్ లక్కీ డ్రా జిల్లా కలెక్టర్ శర్మన్ నేతృత్వంలో జరిగింది.
సికింద్రాబాద్లో మొత్తం 99 మద్యం షాపులకు 1776 దరఖాస్తులు వచ్చాయి. 99 షాపుల్లో ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒకటి, గౌడ్స్కు 6 కేటాయించారు. మొత్తం షాపులకు డ్రా నిర్వహించి డ్రాలో పేర్లు వచ్చిన వారికి దుకాణాలను కేటాయించారు. నారాయణగూడ (గెజిట్ నెం.95) షాపుకు అత్యధికంగా 35 దరఖాస్తులు వచ్చాయి.
మిగతా షాపులకు 15 దరఖాస్తులు అంతకంటే ఒకటి రెండు ఎక్కువగా వచ్చాయి. ఈ యూనిట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, పవన్కుమార్(ఎస్టీఎఫ్)లు సహ పర్యవేక్షణ చేశారు.
హైదరాబాద్ యూనిట్ పరిధిలో…
హైదరాబాద్ యూనిట్ పరిధిలో మొత్తం 80 షాపుల్లో 79 షాపులకు మాత్రమే డ్రా తీశారు. చార్మినార్ ఏరియాలో ఒక షాపు డ్రాను నిలిపివేశారు. 80 షాపులకు 1772 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసరావు పర్యవేక్షణలో డ్రా తీశారు.
బంజరాహిల్స్ ఏరియాలో గల ఒక షాపుకు అత్యధికంగా 40 దరఖాస్తులు రాగా, మిగతా వాటికి 15 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ యూనిట్లో ఎస్టీ ఒకరికి, ఎస్సీ 5, గౌడ్స్కు 4 చొప్పున రిజర్వేషన్ కల్పించారు.
పారదర్శకంగా…
లాటరీ మొత్తం పారదర్శకంగా జరిగింది. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణలో డ్రాను నిర్వహించారు. జిల్లాలోని ఎక్సైజ్ సిబ్బంది మొత్తం ఇక్కడే ఉండి డ్రా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి మద్యం దుకాణాలను దక్కించుకోవాలని చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో ఒక వ్యక్తికి ఒక షాపు మాత్రమే అనే నిబంధన ఉండేది. ఈసారి ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఒక వ్యక్తి ఎన్ని లైసెన్స్లన్నా కలిగి ఉండవచ్చని పాలసీ తీసుకురావడంతో ఒక్కొక్కరు పది నుంచి 15 షాపులకు దరఖాస్తు చేసుకున్నారు. అలా మంచి స్పందన వచ్చింది.
ఇందులో మహిళలు కూడా ఉన్నారు. దరఖాస్తు చేయడమే కాదు పది శాతం షాపులను కూడా వారు దక్కించుకున్నారని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.