ఖైరతాబాద్, జనవరి 9 : ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండడంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు. దీంతో పలువురు ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులు, ప్రైవేట్ ఆపరేటర్లను బల్దియా హైర్ చేసుకున్నది. డేటా ఎంట్రీకి జోనల్ కార్యాలయాల్లో సరిపోను స్థలం లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆధారపడ్డారు. ఖైరతాబాద్ సర్కిల్కు సంబంధించి జోనల్ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు వాసవీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. అలాగే జూబ్లీహిల్స్కు సంబంధించి రాజ్భవన్ హైస్కూల్, సరస్వతీ విద్యామందీర్, భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 12 గంటల వరకు రెండు షిఫ్టులలో డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు 80 ఎంట్రీలను తప్పుల్లేకుండా చేస్తే వారికి రూ.800 చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని తప్పులు లేకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఖైరతాబాద్ జోన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. ఒక్కొక్క దరఖాస్తు ఎంత సమయం పడుతుందని ఆపరేటర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఐటీ స్నేహ శబరీష్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రె తదితరులు పాల్గొన్నారు.