హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఈవీఎంలపై వేలెత్తుతున్నాయని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. బీజేపీకి మళ్లీ అధికారం ఇవ్వాలని యూపీ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అన్నారు. రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసి తమ ఓటమిని దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అయితే ఈవీఎంలను తప్పు పట్టడం సరికాదన్నారు. తప్పంతా ప్రజల మనస్సులలో ఉన్న చిప్దే అని వ్యాఖ్యానించారు.
కాగా, ఉత్తరప్రదేశ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అంచనాల మేరకు ఫలితాలు రాలేదని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగ్గా రాణిస్తామన్న నమ్మకం ఉందన్నారు. దీని కోసం మళ్లీ కష్టపడతామని, రేపటి నుంచే పనిని ప్రారంభిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, పార్టీ కార్యకర్తలు, సభ్యులు, తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.