రంగారెడ్డి జిల్లా కోర్టులు, జనవరి 2 (నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణ టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో అలసత్వం జరిగినందుకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు శ్రీమతి చిట్టినేని లతా కుమారి తీర్పునిచ్చారు. పిటిషనర్ కథనం ప్రకారం.. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిలకమర్తి గోపికృష్ణ అమెరికా నుంచి హైదరాబాద్కు 2020, అక్టోబర్ 6న విమాన టికెట్ బుక్ చేసుకోగా.. కరోనా కారణంగా సదరు విమానయాన సంస్థ సర్వీస్ను రద్దు చేసింది. ఫిర్యాదుదారుడు టికెట్కు చెల్లించిన మొత్తం రూ.71,437లను తిరిగి చెల్లించడానికి సంస్థ అంగీకరించి చెల్లింపు ప్రక్రియ మొదలు పెట్టినట్టు 2021, మార్చి3న సమాచారమిచ్చింది.
అనంతరం ప్రతివాది అయిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఫిర్యాదు దారుడికి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే డబ్బు మొత్తాన్ని రీఫండ్ చేశామని చెప్పడంతో ఫిర్యాది చిలకమర్తి గోపికృష్ణ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడు ఫోరంను ఆశ్రయించిన 20 రోజులకు సదరు సంస్థ రూ.71,437 లను చెల్లించింది. కానీ, ఎయిర్ ఇండియా సంస్థ చెల్లింపులలో జరిగిన జాప్యాన్ని సేవల లోపంగా గుర్తించిన వినియోగదారుల ఫోరం.. ఎయిర్ ఇండియాకు పదివేల జరిమానాతో పాటు ఐదు నెలలుగా జరిగిన జాప్యానికి 6 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.