హైదరాబాద్ : తౌటే తుపాను కారణంగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా ( XJ218 ) విమానం శంషాద్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అయింది. ముంబైకి వెళ్లాల్సిన పలు విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్టుకు మళ్లిస్తున్నట్లు సమాచారం.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాను పెను తుఫానుగా మారి గుజరాత్వైపు పయనిస్తోంది. ఇప్పటికే ఈ తుఫానుతో కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. గుజరాత్లో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాను ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకి, మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్- మహువా (భావ్నగర్ జిల్లా) ల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది.
తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో గుజరాత్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. తుఫాను కారణంగా ప్రచండ గాలులు వీస్తాయని, గాలి వేగం గంటకు 160-185 కి.మీ.కు పెరుగుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సోమవారం మహారాష్ట్ర తీర ప్రాంతంలో గాలి వేగం గంటకు 65-75 కి.మీ.; దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉంటుందని పేర్కొంది.