సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకున్నది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. 2023 ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా ఏడు స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పాతబస్తీలోని చార్మినార్, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్, నాంపల్లిలో గెలుపొందగా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది. కాగా ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులతో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యాకుత్పురా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి కేవలం 810 ఓట్ల తేడాతో గెలుపొందగా, నాంపల్లిలో సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని చివరకు 2175 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.