వ్యవసాయ యూనివర్సిటీ 19: సాగులో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్) డైరెక్టర్ ఎం.సుజాత అన్నారు. శనివారం దేశవ్యాప్తంగా ఆన్లైన్ వేదికగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఐసీఏఆర్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ గతంలో వర్షాధారం.. రసాయన రహిత సాగుతో భూమిలో పోషకాలు పెరిగేవన్నారు. ప్రస్తుతం పంట దిగుబడులు పెరుగుతున్నా వాటిలో నాణ్యత ఉండటం లేదన్నారు. క్రాఫ్ట్ ప్రొడక్షన్, ప్రిన్సిపల్ హెడ్ డాక్టర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులపై తప్పక అవగాహన పెంచుకోవాలన్నారు.
నాగర్కర్నూల్కు జిల్లా పదర గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యంతో తన కుమారుడు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. నిజామాబాద్ నుంచి భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ కార్యదర్శి సాయిరెడ్డి, పద్మయ్య, సీనియర్ శాస్త్రవేత్తలు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.కురేషి, సురేశ్ మట్టి పరీక్షలు, ఎరువుల వాడకం, దాతు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉంటే ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ నుంచి అత్యధికంగా 987 మంది, ఏపీ నుంచి 891, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల రైతులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.