Agriculture University | వ్యవసాయ యూనివర్సిటీ , ఫిబ్రవరి 28: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో దాదాపు 100 ఎకరాల్లో రోజు వారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. నారు పోయడం, తెగుళ్లు సోకకుండా కాపాడటం, చీడపీడలను నియంత్రించడం, నూతన పద్ధతులను కనుగొనడంలో భాగంగా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల క్షేత్ర ప్రదర్శనకు సిద్ధం చేసిన స్థలం..ఇప్పుడు నిరుపయోగంగా మారింది. దాదాపు 40 ఏండ్లుగా ఔషధ విభాగం అభివృద్ధి చేసిన 150 మొక్కల సంరక్షణ ఆగిపోయింది. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ…కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 55ను జారీ చేసింది. దీంతో విద్యార్థులు భగ్గుమన్నారు. వర్సిటీలో పర్యావరణం..వ్యవసాయ పరిశోధనలు, జీవవైవిధ్యానికి ప్రమాదం పొంచి ఉందంటూ..ఆందోళన బాటపట్టారు. ‘సేవ్ ది యూనివర్సిటీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ…వెంటనే 55 జీవోను రద్దు చేయాల్సిందేనని నిరసనలు తెలిపారు. వీరి ఉద్యమానికి ప్రతిపక్షాల నేతలు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వినలేదు.పైగా ఉద్యమాలను నీరే గార్చే పనిలో పడింది. మరోవైపు వంద ఎకరాల వర్సిటీ భూమిలో ఉన్న చెట్లు, మొక్కల సంరక్షణ నిలిపివేయడంతో అవన్నీ వాడిపోతున్నాయి. పైగా ఇదే భూమిలో ఉన్న డ్రోన్ శిక్షణా కేంద్రాన్ని ఎత్తివేసేందుకు సిద్ధం అవుతున్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2014 నుంచి దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించారు. వర్సిటీలో400 రకాల వృక్షజాతులు, 80 రకాల పక్షులు, 350 అరుదైన జాతులతో పాటు జీవవైవిధ్యానికి కొదవలేదు. వ్యవసాయరంగంలో నూతన సంస్కరణలు తెచ్చిపెట్టిందీ విశ్వవిద్యాలయం. అనేక జీవరాశులకు వివిధ రకాల చెట్లకు, పర్యావరణాన్ని పరిరక్షణలో వర్సిటీ కీలక భూమిక పోషిస్తున్నది. ఈ క్రమంలో హైకోర్టు నిర్మాణంతో వర్సిటీ పరిధిలోని పర్యావరణం దెబ్బతింటుందని, వ్యవసాయ పరిశోధనలకు అపారనష్టం వాటిల్లుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.