సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ప్రభుత్వ సిటీ కళాశాల అంతర్జాతీయస్థాయి ప్రముఖులను, విద్యావేత్తలను, క్రీడాకారులను, సామాజికవేత్తలను అందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సిటీ కళాశాల, తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన శత వసంతాల వేడుక ‘మెగా ఫెస్ట్ 2022’ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీ కళాశాలలో చదువుకోవటం మధురమైన అనుభూతి అన్నారు. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించటం మాత్రమే కాదని, సామాజిక సృ్పహ అలవరచుకుని దేశ పునర్నిర్మాణంలో క్రియాశీలంగా పాల్గొనాలని అన్నారు. దేశంలో ఏ ఉద్యమం జరిగినా, తొలి అడుగు సిటీ కళాశాల నుంచి పడిందని గుర్తుచేశారు. ఈ స్ఫూర్తిని ఇప్పటితరం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి, సమైక్య భావనకు హైదరాబాద్ నగరం కేంద్రమని, సిటీ కళాశాల అందుకు ప్రేరణగా నిలిచిందని ప్రశంసించారు.
ఏ రంగంలో చూసినా తప్పనిసరిగా సిటీ కళాశాల పూర్వవిద్యార్థులు కనిపిస్తారని, ఈ ఒరవడికి కొనసాగింపుగా ఇటీవల లండన్లో జరిగిన 2022 కామన్ వెల్త్ క్రీడల్లో కళాశాల విద్యార్థిని బేబీరెడ్డి కాంస్య పతకం సాధించిందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కొనియాడారు. రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో పీహెచ్డీ డిగ్రీ కలిగిన ఆచార్యులు సిటీ కళాశాలలో ఉన్నారని, అందువల్ల ఉస్మానియా వర్సిటీ ఈ కళాశాలకు పరిశోధన కేంద్రం కేటాయించిందని తెలిపారు. వందేండ్ల ఉత్సవాల సందర్భంగా కళాశాలకు 100గదులతో కొత్త భవన నిర్మాణానికి అనుమతినిస్తూ అవసరమైన ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. కళాశాల విద్యార్థినులు లావణ్య, పావని, శ్వేత, సౌమ్యలు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన నవీన్ మిట్టల్ ప్రారంభించారు.
రాజనీతిజ్ఞుల కన్నతల్లి సిటీ కళాశాల అని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ అన్నారు. తనతోపాటు తన కుటుంబంలోని ఎందరో ఇక్కడే చదువుకుని దేశవిదేశాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. నగర ఔన్నత్యానికి తారాణంగా నిలిచే సంస్థల్లో ప్రసిద్ధమైందని పేర్కొన్నారు.
వందేమాతర ఉద్యమం, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో సిటీ కళాశాల కీలక భూమిక పోషించిందని, ఈ స్ఫూర్తిని ఇప్పటి విద్యార్థులు అందుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో పరిశోధన దృష్టి కలిగిన అధ్యాపకులు ఉండటంతో పరిశోధనా కేంద్రం మంజూరు చేశామని చెప్పారు.
తొలిదశ తెలంగాణ ఉద్యమానికి సిటీ కళాశాల ఉద్యమ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిందని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు సిటీ కళాశాల పెట్టనికోట అని అన్నారు. విద్యార్థుల్లో స్థానిక మూలాల ఎరుక, చారిత్రక దృష్టి పెంపొందింపజేయడానికి డిగ్రీ విద్యార్థులతో ‘మన ఊరు-మన చరిత్ర’ ప్రాజెక్టును సాహిత్య అకాడమీ చేపట్టిందని చెప్పారు. అందుకు కళాశాల విద్యాశాఖ సహకారం అందిస్తున్నదని, కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాలభాసర్ మాట్లాడుతూ కళాశాల ఘనకీర్తిని ఈతరానికి తెలిపేందుకే ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. 26న పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం, 27న బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జాజ్ సుల్తానా, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఇ.యాదయ్య, డాక్టర్ జె.రత్నప్రభాకర్ బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.