China Loan Apps | సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): భారత్లో తన ఏజెంట్లను నియమించుకొని.. చైనా నుంచి లోన్యాప్ల ద్వారా అమాయకులను వేధిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్. చౌహాన్, సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చైనాకు చెందిన జినా హ్యాండీలోన్ యాప్ పేరుతో ఒక లోన్ యాప్ను నిర్వహిస్తున్నది. ఈ యాప్ ద్వారా అమాయకులకు లోన్లు ఇస్తూ, ఇచ్చిన సొమ్మును అదనపు వడ్డీలతో బాధితులను నుంచి వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని ఫోన్లలో వేధించడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫోన్ కాంటాక్టులలో ఉన్న వారందరికీ పంపించి డబ్బు వసూలు చేస్తుంటారు. ఇందుకు భారత్లో కమీషన్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలను సేకరిస్తారు. డబ్బులు ఇవ్వడం, వసూలు చేయడం, బ్యాంకు ఖాతాలు సేకరించడం.. ఇలా మూడు వ్యవస్థలను చైనా నుంచి జినా నిర్వహిస్తున్నది. టెలిగ్రామ్ ద్వారా ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందిని కమీషన్ పద్ధతిలో నియామకం చేసుకుంటున్నారు.
20 శాతం కమీషన్తో..
నగరానికి చెందిన బాధితుడు షేక్ అబ్దుల్ భారీ రూ.10,500 హ్యాండీ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించినా.. ఇంకా .. ఇంకా.. డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేస్తూ రూ. 2,49,433 వరకు వసూలు చేశారు. ఇంకా డబ్బు చెల్లించాలంటూ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడటంతో బాధితుడు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, రాజు బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితులను గుర్తించారు. గుర్గావ్కు చెందిన అశుతోష్ మిశ్రా, లవ్మీత్ సాహిని, ప్రశాంత్కుమార్ తన్వార్, ప్రిన్స్ పాల్, వికాస్ శర్మను గుర్తించి గురుగావ్లోనే అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా తమకు పరిచయమైన జినా.. లోన్యాప్ రుణాలు వసూలు బాధ్యతను అప్పగించిందని తెలిపారు.
ప్రతి రోజు 40 నుంచి 50 మంది వివరాలు తమకు పంపిస్తారని, ఆయా నంబర్లకు ఫోన్ చేస్తామని, అవసరాన్ని బట్టి ఫోన్లో తిట్టడం, కాంటాక్టు లిస్ట్లో ఉన్న వారికి అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం, ఆ తర్వాత రుణాలు తీసుకున్న వాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి కాంటాక్టు లిస్ట్లో ఉన్న వారికి అసభ్యకరంగా పంపించడం చేస్తామంటూ చెప్పారు. తమకు వసూలైన దాంట్లో 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తారంటూ వెల్లడించారు. ఈ మేరకు ఈ ఐదుగురిని అరెస్ట్ చేసి, మిగతా వారి కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు 78 మందిని ఈ ముఠా వేధించినట్లు తెలిసిందని, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సీపీ వివరించారు. ఈ ముఠా నుంచి మూడు ల్యాప్టాప్లు, ఆరు మొబైల్ ఫోన్లు, 18 సిమ్కార్డులు, డెబిట్ కార్డు, రూ. 1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
యాప్లకు కాంటాక్టు అనుమతులివ్వద్దు..!
లోన్యాప్ల ద్వారా ఎవరు కూడా రుణాలు తీసుకోవద్దని సీపీ డీఎస్. చౌహాన్ సూచించారు. యాప్ల ద్వారా రుణాలు వద్దన్నా ఇస్తుంటారని, రూ.10 వేలు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తారని, ఇలాంటి వాటి జోలికి వెళ్లవద్దన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో కాంటాక్టు, కెమెరా ఇతర వివరాలు సేకరించేందుకు అనుమతి అడుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని సీపీ సూచించారు.