పహాడీషరీఫ్, అక్టోబర్ 19: నాకు చనిపోవాలని లేదు.. కానీ తప్పని పరిస్థితిలో చనిపోవాలని అనుకుంటున్నాను.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేసి తిరిగి కట్టలేని పరిస్థితిలో చనిపోతున్నాను.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని చెరువులో దూకి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ కథనం ప్రకారం.. మలక్పేటకు చెందిన అబ్దుల్ నవీద్ (40) ప్రభుత్వ ఉద్యోగి. మింట్కంపౌండ్లో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. చాదర్ఘట్ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.
17న జల్పల్లి చెరువు వద్దకు బైక్పై వచ్చిన అతడు.. తాను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనకు చనిపోవాలని లేదు కానీ.. తప్పని పరిస్థితుల్లో చనిపోవాలని అనుకుంటున్నానని ఆ వీడియోలో చెప్పాడు. “చేసిన అప్పులు తీరకపోవడంతో ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సి వచ్చింది.. ఎక్కడ కూడా వృథా ఖర్చులు పెట్టలేదు.. అమ్మని మంచిగా చూసుకో..” అంటూ తమ్ముడికి సూచించాడు. తన శవం దొరికితే నాన్న సమాధి వద్ద పూడ్చి పెట్టాలంటూ ఆ వీడియోలో తెలిపాడు. ఫోన్ను చెరువు వద్ద నిలిపిన ద్విచక్ర వాహనంలో పెట్టడంతో విషయం బయటకు వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఇద్దరు గజ ఈతగాళ్లతో గాలించినా అతడి మృతదేహం లభ్యం కాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా..! లేక.. మరెక్కడికైనా వెళ్లాడా..! అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.