మెహిదీపట్నం మార్చి 4: అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాడమాడుతూ కల్తీ నెయ్యిని తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మాసాబ్ట్యాంక్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కల్తీ నెయ్యిని తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులను, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అడిషినల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం..మాసాబ్ట్యాంక్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 సమీపంలోని భోలానగర్లో నివసించే మహమ్మద్ జునైద్ హుస్సేన్కు ఫ్రైడ్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తుల దుకాణం ఉంది.
తనకు వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ సంపాదన కోసం కల్తీ నెయ్యి తయారీ చేసి స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేస్తూ విందులకు ,దుకాణాలకు పెద్ద ఎత్తున అమ్ముతున్నాడు. దీనిపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్,మాసాబ్ట్యాంక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తమ బృందంతో కలిసి భోలానగర్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ దాడిలో అతడి వద్ద నుంచి రూ. 18లక్షల26 వేల విలువ చేసే కల్తీ నెయ్యి, ఆవు, గేదె మీగడ, కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే డాల్డాలను స్వాధీనం చేసుకున్నారు. 460 కేజీల కల్తీ నెయ్యి,70 కేజీల కల్తీ మిశ్రమ నెయ్యి, 2090 కేజీల ఆవు మీగడ,1070 కేజీల గేదె మీగడ,28 డబ్బాల(ఒక్కొక్కటి 15 కేజీల) డాల్డా ను ,మిషన్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషినల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇతడు తక్కువ నాణ్యత కలిగిన పామ్ ఆయిల్, డాల్డా, ఆవు, గేదె మీగడలను, కల్తీ నెయ్యి తయారు చేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.