DOST | సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): నగర టాప్మోస్ట్ కళాశాలల్లో చదివేందుకు గ్రామీణ విద్యార్థులు పోటీ పడుతున్నారు. నగరంలో 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు వివిధ కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు పొందినట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) వెబ్సైట్ ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక కళాశాలలైన నిజాం కళాశాల, కోఠిలోని ఉమెన్స్, సిటీ కాలేజీ, బేగంపేట మహిళా కళాశాలల్లో దోస్త్ ద్వారా 2022-2023 ఏడాదికి గాను 5,100 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో1520 మంది, ప్రభుత్వ సిటీ కాలేజీలో 1415 మంది, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1294 మంది, నిజాం కళాశాలలో 915 మంది అడ్మిషన్లు పొందినట్లు అధికారిక వివరాలు ఉన్నాయి.
నగరంలో నూతన కోర్సుల్లో చేరాలనే..
ఆయా కళాశాలలు విస్తృత శ్రేణిలో కోర్సు కాంబినేషన్లను అందిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల విద్యార్థులు సైతం హైదరాబాద్లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ముందుకు సాగుతున్నారు. నగరంలో కోర్సులు పూర్తిచేసిన వెంటనే వృత్తిపరమైన ఉపాధిని పొందవచ్చనే ఆలోచనతో కూడా విద్యార్థులు నగర కళాశాలల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకు అణుగునంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతులను కల్పిస్తుండటంతో విద్యార్థులు సైతం నగరంలో చదవడానికి ఇష్టపడుతున్నారు.
టాపర్లుగా నిలిచిన వారికే సీట్లు
నగరంలో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా జిల్లాల్లో ఇంటర్మీడియట్లో టాపర్లుగా నిలిచిన వారే. గత ఏడాది నల్లగొండకు చెందిన విద్యార్థులు తెలంగాణ మహిళావిశ్వవిద్యాలయంలో 114 మంది చేరగా, ప్రభుత్వ సిటీ కళాశాలలో 147 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. అయితే దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్లో పొందిన మెరిట్ ఆధారంగా కేటాయిస్తారని పేర్కొన్నారు. కాగా 2023-2024కు మరింత మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.