Telangana | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : గుర్తింపు పొందని గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లోని విద్యార్థుల సర్దుబాటుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నలుగురు ఉన్నతాధికారుల కమిటీ సిఫారసుల మేరకు విద్యార్థులను సర్దుబాటు చేయాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఇటీవలే మెమో జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులు నష్టపోకుండా, వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్దుబాటుపై పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ రెండు వర్సిటీల్లోని విద్యార్థుల సర్దుబాటుకై జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు వీ వెంకటరమణ, ఎస్కే మహమూద్, ఓయూ వీసీ డీ రవీందర్ల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
శ్రీనిధి వర్సిటీలోని విద్యార్థులను అదే విద్యాసంస్థ నడుపుతున్న శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో, గురునానక్ వర్సిటీలోని ఇంజినీరింగ్, ఎంబీఏ విద్యార్థులను అదే విద్యాసంస్థ నడుపుతున్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఇక ఎంసీఏలో సగం విద్యార్థులకు ఓయూకు, మరో సగం జేఎన్టీయూకు, బీసీఏ విద్యార్థులను ఓయూలో సర్దుబాటు చేయాలని సూచించింది. ఇక బీఎస్సీ, బీపీటీ, బీకాం, బీబీఏ, వంటి కోర్సుల్లోని విద్యార్థులను మల్లారెడ్డి, అనురాగ్ వర్సిటీలకు బదలాయించాలని కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వ యథాతథంగా ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ రెండు వర్సిటీల విద్యార్థులకు ఉపశమనం కలగనున్నది.
మార్గదర్శకాలిలా..
సర్దుబాటులో భాగంగా విద్యార్థులు చెల్లించిన ఫీజులను గురునానక్, శ్రీనిధి విద్యాసంస్థలు ఆయా కాలేజీలకు బదలాయించాలి.
విద్యార్థులను చేర్చుకున్న కాలేజీలు ఆయా విద్యార్థుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో అదనపు ఫీజులను వసూలు చేయరాదు.
గురునానక్కు ఖరారుచేసిన ఫీజునే కోర్సు పూర్తయ్యే వరకు తీసుకోవాలి. అంటే రాబోయే మూడేండ్లలో ఒకే ఫీజు విధానం అమలవుతుంది.