మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 12: ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్లరాదని, ఒక వేళ తీసుకెళ్లినా.. సరైన ధ్రువపత్రాలు వెంట ఉండాలని, లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలు తప్పకుండా పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని, జిల్లా వ్యాప్తంగా నగదు, మద్యం తరలించడం వంటి చర్యలకు పాల్పడకుండా పటిష్టమైన బందోబస్తు, నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీసీపీ జానకి, రిటర్నింగ్, నోడల్, ఎక్సైజ్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.