మణికొండ, సెప్టెంబర్ 5 : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో జలమయమైన లోతట్టుప్రాంతాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మణికొండ మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని పంచవటికాలనీ, అంజలిగార్డెన్స్లలో కమిషనర్ ఫల్గుణ్కుమార్, సిబ్బందితో కలిసి సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, మేనేజర్ రమేశ్, టౌన్ప్లానింగ్ అధికారి రాకేశ్ పాల్గొన్నారు.
నిండుకుండల్లా చెరువులు…
మణికొండ, సెప్టెంబర్ 5 : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండకుండల్లా మారగా, పలు కాలనీల్లో రహదారులపై వర్షపునీరు పొంగుతుంది. ఈ క్రమంలో మంగళవారం కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పంచవటికాలనీలో మరోసారి కాలనీల రహదారులు వర్షపునీటితో నిండిపోయాయి. మున్సిపల్ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టి నీటిని దిగువ ఉన్న కాలువలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
రాజేంద్రనగర్లో
బండ్లగూడ,సెప్టెంబర్5: భారీ వర్షాలతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజులగా కురుస్తున్న వర్షాలతో కాలనీలు,రోడ్లన్నీ జలమయం కావడంతో జీహెచ్ఎంసీ మాన్ సిబ్బందితో పాటు అధికారులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాలలో నిల్చిన వర్షం నీటిని సాఫీగా వెళ్లేందుకు తగిన చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారి వెంట పిల్లర్ నంబర్ 191 వద్ద నిలిచిన వర్షం నీటితో సుమారు గంట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవి కుమార్ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న అధికారులు వర్షం నీరు వెళ్లేందుకు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఉప కమిషనర్ రవి కుమార్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ పర్యటించారు.
బండ్లగూడ జాగీర్లో…
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో మాన్ సిబ్బందితో పాటు శానిటేషన్ సిబ్బంది,ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఈసీ ప్రాంత ప్రజలకు ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మేయర్ మహేందర్గౌడ్,కార్పొరేటర్ శ్రీనాథ్రెడ్డి,తదితరులు పలు ప్రాంతాలను సందర్శించారు.
శంషాబాద్లో
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 5 : శంషాబాద్ పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, ఆర్బినగర్, ఆదర్శనగర్, మహావీర్కాలనీ,పాత శంషాబాద్తో పాటు వివిధ ప్రాంతాలలో ఉదయం నుంచి భారీ వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడ ఔటర్రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద నీరు నిలవడంతో మున్సిపల్ అధికారులతో పాటు బీఆర్ఎస్ నాయకుడు బండి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డులో నిలిచిన నీటిని పూర్తిగా తొలగించారు. మండలంలోని ఈసీ, ఎంటేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో హిమాయత్నగర్ చెరువు రెండు గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలారు. దీంతో శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి.
అత్తాపూర్ డివిజన్లో ..
అత్తాపూర్, సెప్టెంబర్ 6: అత్తాపూర్ డివిజన్లో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయ మ య్యాయి. మ్యాన్ హోళ్లు పొంగడంతో బస్తీలలో రహదారులన్నీ మురుగునీటితో నిండి పోయాయి. వాన కారణంగా నందిముస్లాయిగూడ ప్రదాన రహదారి నీటితో నిండిపోయింది. పీవీఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 191 వద్ద కార్లు నీటిలో మునిగేలా నీరు నిలచిపోయింది. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హుడాకాలనీ, భరత్నగర్ల ప్రజలు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచే రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ, విద్యుత్శాఖ అధికారులు బస్తీలలో పర్యటించి సమస్యలను పరిష్కరించారు. ప్రధానదారుల పై నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నామని డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ తెలిపారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి
బండ్లగూడ, సెప్టెంబర్ : భారీ వర్షాల నేపథ్యంలో రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి జంట జలాశయాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం జలాశయాల గేట్లు ఎత్తడంతో ఈసీ మూసీ నదిల పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసులకు సూచించారు.