సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం నగరంలోని పలు డిపోలు, పలు కేంద్రాల నుంచి శివార్లలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు కలిసి వచ్చే విధంగా మరో 30 సిటీ బస్సులను సోమవారం నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి తెలిపారు. ప్రస్తుతం 333 బస్సులు నడుస్తున్నాయని, మరో 30 కలిపి మొత్తం 363 సిటీ బస్సులను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.
ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం, గురునానక్ యూనివర్సిటీ, బోయినపల్లి నుంచి మేడ్చల్ కారిడార్, మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి కారిడార్, ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్, మజీద్నగర్, ఉప్పల్ నుంచి అవుశాపూర్, ఘట్కేసర్ కారిడార్, జీడిమెట్ల నుంచి గండి మైసమ్మ కారిడార్, ఈసీఐఎల్ నుంచి బోగారం, కీసర కారిడార్లకు విద్యార్థుల కోసం బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ బస్సులు ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6 గంటల వరకు నడుస్తాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పెద్ద సంఖ్యలో సద్వినియోగం పరుచుకోవాలని కోరారు.