సుల్తాన్బజార్, ఫిబ్రవరి 12 : దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు మేరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఆప్ రాష్ట్ర కమిటీ ముట్టడించింది. ఈ సందర్భంగా ఆప్ నాయకులు, కార్యకర్తలు జెండాలు, ప్లకార్డులు చేతబూని ఎల్ఐసీని రక్షించండి – ఎస్బీఐని రక్షించండి- దేశాన్ని రక్షించండి, ప్రజల సొమ్మును రక్షించండి- మోదీ అదానీ విశ్వాస ఘాతుకాలు ఆపండి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా..పోలీసులు అడ్డుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ అదానీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి దేశ ప్రధాని తన పదవిని దుర్వినియోగం చేసి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో బొగ్గు, పోర్టులు, ఇంధనం, రవాణా, విద్యుత్ ప్రాజెక్టులు అక్రమంగా ఇప్పించారని ఆరోపించారు. అదానీ కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడి విలువ 77 వేల కోట్లు నుంచి 53 వేలకు పడిపోయిందన్నారు. ఫలితంగా ఎల్ఐసీకి 23 వేల 500 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఎల్ఐసీకి పబ్లిక్ మనీ ద్వారా సమకూరిన నిధులని… ప్రధాని మోదీకి తెలియదా ? ఎలా అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిస్తాడని అన్నారు. కోట్లాది మంది భారతీయులు తమ డబ్బులను ఎల్ఐసీ, ఎస్బీఐ, పీఎన్బీలలో దాచారని, ప్రజలకు తమ పొదుపు డబ్బును ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. అదానీ గ్రూప్లలో ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను ప్రమాదానికి గురి చేసిందని, దేశ ప్రజానీకానికి తీవ్ర నష్టమన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, శోభన్ భూక్యా, నాయకులు డాక్టర్ హరిచరణ్, టి.రాకేశ్ సింగ్, అఫ్జల్, మాజీద్ పాల్గొన్నారు.