బంజారాహిల్స్, ఫిబ్రవరి 12: తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో ఉన్నానని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించకుండా తమ ఫోన్లలో వీడియోలు తీయడం చాలా బాధాకరమని, అలాంటి సమయాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడాలని.. వీడియోలు తీస్తూ అత్యంత కీలకమైన సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్లో నగర పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, హీరో సాయిధరమ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్తేజ్ మాట్లాడుతూ..రోడ్డుపై వాహనాలు నడిపించే వారంతా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గించుకోవచ్చని, ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు. సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం యువతే మృత్యువాత పడుతున్నదని, ట్రాఫిక్ నియమాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో పాటు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, డీసీసీ విజయ్కుమార్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావేద్, అమీర్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.