సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. జంట జలశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల కింది భాగం నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసీ నదుల తీర ప్రాంతం నగరం పరిధిలో సుమారు 59 కి.మీ మేర ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాన్ని 5 భాగాలుగా గుర్తించారు. అందులో జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు, అదేవిధంగా పీర్జాదిగూడ నుంచి గౌరెల్లి బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, బాపూఘాట్ నుంచి హైకోర్టు వరకు, చాదర్ఘాట్ బ్రిడ్జి నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాలను నెవర్ డెవలప్మెంట్గా, హైకోర్టు నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని ఓల్డ్ కోర్ సిటీగా గుర్తించారు.
మూసీ సుందరీకరణకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ‘సిమ్యులేషన్ మోడల్ ఫర్ హైడ్రాలిక్స్ ’ ప్రాజెక్టును రూపొందించేందుకు ఇప్పటికే కన్సల్టెన్సీలను ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా ఎకనామిక్ హబ్, టూరిజం హబ్, ఇంప్రూవ్డ్ యాక్సెసబిలిటీ, ఇంప్రూవ్ క్వాలిటీ లైఫ్, ఎన్విరాన్మెంట్, ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రిజర్వేషన్, ప్రాపర్టీ వాల్యూ అండ్ టాక్సెస్, సిటీ ఇమేజ్ ఇలా పలు అంశాలన్నీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించి, దానికి డిజైన్లు చేసి నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం దేశ, విదేశాలకు చెందిన ఆర్కిటెక్టులతోనూ సంప్రదిస్తున్నారు.