జూబ్లీహిల్స్,జనవరి18: నగరంలో పేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కమలానగర్లో చురుకుగా సాగుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డివిజన్లో రూ.17.85 కోట్లతో 210 డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలు చేపట్టారు. నగర పాలక సంస్థ హౌసింగ్ విభాగం ఆధ్వర్యంలో 150 మంది లబ్ధిదారుల కోసం చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో 90 గృహాలతో చేపట్టిన ‘ఏ’ బ్లాక్లో నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
నగర పాలక సంస్థ హౌసింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘బి’ బ్లాక్లో మరో 120 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో గృహానికి రూ.8.50లక్షలతో రెండు డబుల్ బెడ్రూమ్లతో పాటు ఒక హాల్, ఒక కిచెన్, 2 టాయిలెట్లతో 560 గజాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. దీనితో పాటు కాలనీలో అంతర్గత రోడ్లు, సీవరేజీ లైన్లు, విద్యుత్ సరఫరా పనులు చేపట్టనున్నారు.
డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసుల నీటి సౌకర్యం కోసం భారీ సామర్థ్యం కలిగిన గ్రౌండ్ వాటర్ ట్యాంక్తో పాటు 5 ఫ్లోర్లలో నిర్మిస్తున్న ఈ భవనానికి లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
ఏప్రిల్ కల్లా అందుబాటులోకి తెస్తాం..
కమలానగర్లో చేపడుతున్న 210 డబుల్ బెడ్రూమ్ గృహాల నిర్మాణం ఏప్రిల్ వరకు పూర్తిచేస్తాం. ఎమ్మెల్యే, కార్పొరేటర్, బస్తీ నాయకుల సహకారంతో నిర్మాణం తుదిదశకు చేరుకుంది. కాలనీ నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-ఎమ్.వెంకటదాస్ రెడ్డి, ఈఈ,హౌసింగ్, జీహెచ్ఎంసీ