సిటీబ్యూరో/మేడ్చల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల విభాగం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందస్తుగా ఓటరు స్లిప్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటింగ్ శాతం పెంచాలనే లక్ష్యంతో ఇంటింటికీ వెళ్లి పెద్ద ఎత్తున వినూత్నంగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు ఓటరు స్లిప్పులను పంపిణీ చేసి, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 45 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, వచ్చే నెల 3వ తేదీ నాటికి ఓటరు స్లిప్ల పంపిణీ పూర్తి చేయడమే లక్ష్యంగా బీఎల్వోలు, పొదుపు సంఘాల మహిళలు, యూసీడీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. కాగా, భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోనూ ఓటరు స్లిప్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతున్నది.