సిటీబ్యూరో, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): చట్ట విరుద్ధంగా ఎవరైనా బ్లడ్ బ్యాంక్లను నిర్వహించినా, లేక అక్రమాలకు పాల్పడినా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బీవీ కమలాసన్రెడ్డి హెచ్చరించారు. ఔషధాల తయారీ ల్యాబ్లు, ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపుల నిర్వహణ తదితర వాటిపై నిరంతరం సూక్ష్మ పర్యవేక్షణ పెట్టామని, ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీ వివరించారు. ‘రక్తంతో వ్యాపారం’ శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు స్పందించిన డీజీ కమలాసన్రెడ్డి 2023లో 26,133 తనిఖీలు నిర్వహించడం జరిగిందని వివరించారు.
ఈ తనిఖీల్లో భాగంగా 4,991 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ బ్యాంక్లకు సంబంధించి 157 తనిఖీలు చేపట్టామని, అందులో 56 బ్లడ్బ్యాంక్లను సీజ్ చేసినట్లు వివరించారు. 61 ఔషధ కేసుల్లో కన్విక్షన్ పడే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్కెట్లో చలామని అవుతున్న నాణ్యత లేని 60 ఔషధాలను గుర్తించామని, నిబంధనలు పాటించని ఔషధ తయారీ కేంద్రాలకు 43 సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశామని, 15 ప్రొడక్ట్ లైసెన్స్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా రెండు ప్రొడక్ట్ లైసెన్స్లను రద్దు చేయడం జరిగిందన్నారు. ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ 8 ఔషధ తయారీ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.