జగద్గిరిగుట్ట, మే17: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా సోషల్మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ14 మందిపై కేసు నమోదు కాగా, మొత్తం 50మంది వీడియోలను, అభ్యంతరకర కంటెంట్ను పోస్ట్ చేసినట్టు గుర్తించారు. సోషల్మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం చేయడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గోప్యతకు భంగం కలుగిస్తున్న సోషల్మీడియా ఖాతాలలో కంటెంట్ తొలగించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధితురాలికి వ్యతిరేక ప్రచారంపైనా జిల్లా చైల్డ్వెల్ఫేర్ ప్రతినిధులు కూడా పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారంతో పోలీసులను, ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న వీడియోలను పోలీసులు ఇప్పటికే కొన్నింటిని గుర్తించారు. అప్లోడ్ చేయడం, వాటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువసార్లు షేర్ చేసినవారి వివరాలను ఆరా తీశారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి నిందితుడి అరెస్టు వరకూ.. కేసు తీవ్రత తగ్గేలా, బాధితురాలిని తప్పుబడుతూ పలువురు సోషల్మీడియా ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
నిందితునికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు చూపే ప్రయత్నంలో డబ్బులు తీసుకొని ప్రచారం చేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితులకు మద్దతుగా ప్రచారం, పోక్సో బాధితుల వివరాలు వెల్లడయ్యేలా చేయడం నేరం, సోషల్మీడియాలో పోక్సో కేసులో వ్యతిరేక ప్రచా రం చేసినవారిపై విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.