బంజారాహిల్స్, అక్టోబర్ 7: హత్యాయత్నం కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల మీదకు కుక్కలను ఉసిగొల్పడంతో పాటు దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రోడ్ నం 12లో నివాసముంటున్న విశ్రాంత ఉద్యోగి సయ్యద్ అహ్మద్ జాఫ్రీ(71)కి జూబ్లీహిల్స్ రోడ్ నం. 86లో ఉంటున్న ఆరిఫ్ మొహియుద్దీన్(29) అనే వ్యక్తి మధ్య ఓ స్థలం విషయమై వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో సుమారు 20మంది గుండాలతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాఫ్రీ ఇంట్లోకి ప్రవేశించి హత్యాయత్నం చేసిన ఘటనలో ఆరిఫ్పై కేసు నమోదైంది.
నిందితుడిని అరెస్ట్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు బుధవారం సాయంత్రం ఆరిఫ్ ఇంటికి వెళ్లగా, అతడు తలుపులు వేసుకున్నాడు. బయటకు రావాలంటూ పిలిచినా.. పట్టించుకోకపోగా పోలీసుల మీదకు కుక్కలను ఉసిగొల్పాడు. అంతటితో ఆగకుండా ఆరిఫ్ తల్లితో పాటు చెల్లెళ్లు బయటకు వచ్చి దుర్భాషలాడారు. లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పోలీసులపై బాటిళ్లు విసిరేస్తూ వీరంగం సృష్టించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హఫీజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడితో పాటు అతడి చెల్లెళ్లు జబీన్(30),షబానా బేగం(25)లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరిఫ్ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.