జనావాసాల మధ్యనే కొనసాగుతున్న గోదాంలు
భద్రతా ప్రమాణాలు పాటించని నిర్వాహకులు
గతంలో రెండుసార్లు అగ్నిప్రమాదాలు
బేగంపేట్ మార్చి 28: బేగంపేట్ డివిజన్ ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో జనావాసాల మధ్య ప్రమాదకరంగా పదుల సంఖ్యలో స్క్రాప్ గోదాంలు కొనసాగుతున్నా యి. నిర్వాహకులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకోక పోవడంతో పాటు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా గోదాంలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సేకరించిన ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు, పాలిథిన్ కవర్లు సీసాలు పెద్ద ఎత్తున పోగు చేస్తూ ఇక్కడ నిల్వ చేస్తున్నారు. గతంలో ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలోని స్క్రాప్ గోదాంలో రెండు సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు పలుమార్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బస్తీ వాసులు వాపోతున్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని రాణిగంజ్, నల్లగుట్ట, ఓల్డ్బోయిగూడ, మహంకాళి వీధి, మినిస్టర్రోడ్డు ప్రాంతాల్లో కూడా వం దల సంఖ్యలో ఈ గో దాంలు ఉన్నాయి. జనవాసాల మధ్య నుంచి స్క్రాప్ గోదాంను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
నోటీసులు జారీ చేసి తొలగిస్తాం
బేగంపేట్ సర్కిల్ పరిధిలో అక్రమంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన స్క్రాప్ గోదాంలకు నోటీసులు జారీ చేసి పూర్తి స్థాయిలో తొలగిస్తాం. ఇప్పటికే మా దృష్టికి వచ్చిన గోదాంలకు నోటీసులు జారీ చేశాం. అధికారింగా అనుమతులు, నిబంధనలు కచ్చితంగ పాటించేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా బేగంపేట్ ప్రకాశ్నగర్, రాణిగంజ్, మినిస్టర్రోడ్డు, నల్లగుట్ట ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు దృష్టికి వచ్చింది. – ముకుందరెడ్డి,బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్